ఆదాయ లక్ష్యాలు అందుకోవాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

పల్లవి, వెబ్ డెస్క్ : నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ యంత్రాంగం యావత్తు కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం కమర్షియల్ టాక్స్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆదాయం కోల్పోతున్న ప్రాంతాలను గుర్తించాలని, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, వ్యాపార లావాదేవీలను కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇకనుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కమర్షియల్ ట్యాక్స్ శాఖ ప్రగతి పై సమీక్ష నిర్వహిస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు.
Gst రేట్ రేషనలైజేషన్ ద్వారా రాష్ట్రము కోల్పోతున్న ఆదాయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.జీఎస్టీ ఎగవేత దారుల పైన కఠినంగా వ్యవహరించాలని, అదేవిధంగా నిఘా వ్యవస్థ నిరంతరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని, అధికారుల నిర్లక్ష్యం మూలంగా రాష్ట్ర ఆదాయానికి గండి పడే ప్రమాదం ఉందని అన్నారు. ఉన్నత స్థాయి అధికారులు నిత్యం ఏఐ టెక్నాలజీని వినియోగించుకుని పర్యవేక్షణ సాగించాలని ఆదేశించారు.రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లావాదేవీలు పన్నుల వసూలులో వస్తున్న సమస్యలను అధిగమించడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.
గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కమర్షియల్ ట్యాక్స్ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్, ఆడిట్ తదితర విభాగాల్లో సాధించిన ప్రగతిని సమీక్షించారు. ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ శాఖలో అంతర్గతంగా కమిటీలు వేసి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ SA రిజ్వీ, కమిషనర్ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరి కిరణ్, డిప్యూటీ కమిషనర్లు సౌజన్య, వాసవి, సంయుక్తారాణి, సునీత, గీత తదితరులు పాల్గొన్నారు.