ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా జైళ్లు – మంత్రి శ్రీధర్ బాబు

పల్లవి, వెబ్ డెస్క్ : జైళ్లు నిరాశకు కేంద్రాలుగా కాకుండా, ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా మారాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. “ఏడో ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్ – 2025” సందర్భంగా ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన ‘కల్చరల్ నైట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, వాటిని మానవత్వంతో కూడిన సంస్కరణలకు వేదికలుగా తీర్చి దిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
ఖైదీలలో మార్పు తీసుకొచ్చేందుకు తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచాయని కొనియాడారు. “జైళ్ల గోడల మధ్య భారతదేశపు భిన్నత్వం కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాలు, భాషలు, మతాలు, సంస్కృతులకు చెందిన ఖైదీలు ఉంటారు. వీరికి ఒకే రకమైన సంస్కరణ విధానం సరిపోదు. అందుకే వారి వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకొని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి” అని అధికారులకు సూచించారు. జైళ్లను సాంకేతికతతో అనుసంధానించి ఖైదీలకు డిజిటల్ విద్య, నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
పునరావాస కార్యక్రమాలు, ఖైదీల ఆరోగ్యం, మానసిక స్థితిని పర్యవేక్షించడానికి కూడా టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి సారించామన్నారు. ఖైదీల్లో సంస్కరణ అనేది కేవలం జైళ్ల శాఖ బాధ్యత మాత్రమే కాదని, అది మనందరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తదితరులు పాల్గొన్నారు.