కేటీఆర్ అరెస్ట్ రాష్ట్ర ప్రజలపై దాడి చేయడమే: హరీశ్

పల్లవి, మెదక్ : కాంగ్రెస్ ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తూ.. మోసాలను ఎండగడుతున్న కేటీఆర్ మీద కుట్ర చేయడం అంటే.. అది రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడమే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేటీఆర్ను అరెస్టు చేయిస్తా అని లీకులు ఇస్తున్నారని, కేటీఆర్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం హరీశ్ రావు మెదక్ జిల్లా నర్సాపూర్ లో మీడియాతో మాట్లాడారు.
‘‘కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు. రాష్ట్ర గౌరవం, ప్రతిష్టను పెంచిండు. ముంబై, ఢిల్లీ, బెంగళూరును కాదని హైదరాబాద్కు పెట్టుబడులు తెచ్చిండు. ఐటీలో తెలంగాణను నంబర్ వన్గా చేసిండు. నువ్వేమో డైవర్షన్ కోసం కేసులు పెడుతా..? అరెస్టులు చేయిస్తా..? అని లీకులు ఇస్తున్నవ్. నీ లీకులకు, తాటాకు చప్పుళ్లకు ఎవడు భయపడడు. ఇవాళ కేటీఆర్ మీద కుట్ర చేస్తున్నావ్ అంటే అది ప్రశ్నించే గొంతు మీద కుట్ర. ప్రశ్నించే గొంతు మీద దాడి. కేటీఆర్ నీ ప్రభుత్వాన్ని బట్టలు విప్పిండు. మీ అన్యాయాలను ప్రశ్నించిండు. మీ మోసాలను ఎండగట్టిండు. అందుకే నీవు కేటీఆర్ మీద పగ పట్టినవ్.. కక్ష పెంచుకున్నవ్. కానీ ఈ దాడి ఒక్క కేటీఆర్ మీద కాదు.. ఇది రాష్ట్ర ప్రజల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి, ప్రశ్నించే గొంతు మీద దాడిగా మేం చూస్తున్నాం” అని హరీశ్రావు పేర్కొన్నారు.