తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి స్వాతంత్య్ర పోరాటం – మాజీ సీఎం కేసీఆర్

పల్లవి, వెబ్ డెస్క్ : దేశ స్వాతంత్య్ర దినోత్సవం, 15 ఆగస్ట్, పురస్కరించుకుని, రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బి ఆర్ ఎస్ అధినేత, కె . చంద్ర శేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.పరాయి పాలన నుండి దాస్య శృంఖలాలను తెంచుకుని, స్వేచ్ఛా వాయువులతో భరతమాత స్వయంపాలన దిశగా అడుగులేసి, నేటికి 79 ఏండ్లు గడిచినాయని పేర్కొన్నారు.
త్యాగనిరతితో ఎందరో అమర వీరులు, దేశ భక్తులు చేసిన ఆత్మార్పణలు మహోన్నతమైనవని కేసీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం సాగిన బలిదానాలు, త్యాగాల చరిత్రను కేసీఆర్ స్మరించుకున్నారు.స్వాతంత్య సమరాన్ని నిరాయుధ శాంతియుత పద్ధతిలో నడిపించిన మహాత్మాగాంధీ అహింసా పద్ధతిలో నడిచిన దేశ స్వాతంత్య్ర పోరాట కార్యాచరణ స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం ఇమిడివున్నదని తెలిపారు.
జాతి ఆత్మగౌరవం కోసం స్వయంపాలన కోసం చేసిన త్యాగాలు స్వాతంత్య్రం అనంతర భారత దేశంలో స్వార్థ రాజకీయాలకోసం దుర్వినియోగం కావడం బాధాకరమని తెలిపారు.స్వతంత్య్ర భారత దేశంలో ప్రత్యేక రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, పదేండ్ల అనతికాలంలోనే ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందని తెలిపిన కేసీఆర్, అమరుల త్యాగాలను గౌరవించి, స్వాతంత్య్ర ఫలాలు చివరి గడపకు చేరి, దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేసిన నాడే దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మరింత ఇనుమడిస్తాయని స్పష్టం చేశారు.