జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం

పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ను తెలంగాణ ఆర్థిక ఇంజిన్గా మార్చిన గత పదేళ్ల తమ ప్రభుత్వ పాలనకు భిన్నంగా, కాంగ్రెస్ పార్టీ విధానాలు నగరాన్ని పూర్తిగా కుప్పకూల్చేలా ఉన్నాయని, ఈ విషయాన్ని నగర ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే భారత రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపై కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉందని కేటీఆర్ గుర్తు చేశారు.
సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్ల నష్టపోయాయని ఆయన అన్నారు.ఈ రోజు హైదరాబాద్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశానికి కేటీఆర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ సీనియర్ నేతలు కేటీఆర్తో చర్చించారు. ఈ ఉప ఎన్నికలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి, జూబ్లీహిల్స్ నుంచి భారత రాష్ట్ర సమితి విజయయాత్రను తిరిగి ప్రారంభించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.