నేడే తెలంగాణ క్యాబినెట్ భేటీ
పల్లవి, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో సమావేశం కానున్నది. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదా బిల్లు గురించి చర్చించనున్నది. దీంతో పాటు సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై నిపుణుల కమిటీ నివేదిక , దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాల సవరణ, సీతారామ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పనులపైనా చర్చించబోతుంది.
మరోవైపు ఇవాళ కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం ఉంది. ఈ నివేదిక అందితే క్యాబినెట్ భేటీలో యథావిధిగా జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జూలై ముప్పై ఒకటో తారీఖున కమీషన్ పదవీకాలం ముగియనుండటంతో ఆలోగా కాళేశ్వరం నివేదిక ఇవ్వాలని చైర్మన్ ఘోష్ నిర్ణయించారు.ఇప్పటికే విద్యుత్ సంస్థలో జరిగిన పలు అక్రమాలకు సంబంధించి జస్టీస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమీషన్ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
కాళేశ్వరం కమీషన్ ఘోష్ నివేదిక అందితే రెండు రిపోర్టులకు మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ఆమోదం తర్వాత రెండు కమీషన్ల రిపోర్టులపై తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించనుంది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చించే అవకాశం ఉంది. గోశాలల పాలసీ, ఇందిరమ్మ ఇళ్లు, యూరియా లభ్యత , రేషన్ కార్డుల పంపిణీ , చొక్కారావు ఎత్తిపోతల పథకం పనులు, రవాణా శాఖ పన్నుల వసూలు సవరణ అంశాలపై చర్చించే అవకాశం ఉందని సచివాలయం వర్గాలు చెబుతున్నారు.



