కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించలేదు. పూర్తిగా కనుమరుగవడం తథ్యమని ఆయన ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ విషయంలో కేసీఆర్ అనుసరించిన వైఖరే బీఆర్ఎస్ పతనానికి కారణమవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
“తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ. ఎందరికో అవకాశాలు కల్పించిన పార్టీ. కొందరు చేసిన కుట్రల వల్ల ఆ పార్టీ ఈ రోజు తెలంగాణలో సమస్యలు ఎదుర్కొంటోంది. ఇన్ని దుర్మార్గాలకు పాల్పడిన మీరు (కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి) ఇక ఎలా మనుగడ సాగిస్తారు? ప్రకృతి ధర్మం అనేది ఉంటుంది. అది మిమ్మల్ని శిక్షిస్తుంది” అని ఆయన అన్నారు.
ఒకప్పుడు ఏ పార్టీని బతకనీయకుండా, ఎవరూ రాజకీయం చేయకూడదని అక్రమ కేసులు పెట్టిన వారు ఇప్పుడు వారిలో వారే తన్నుకు చస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని అన్నారు. వారిని ఎవరూ కొట్టాల్సిన అవసరం లేదని, వారే ఒకరినొకరు కొట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.