రేవంత్ రెడ్డికి హారీశ్ రావు కౌంటర్
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కౌంటరిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ‘ ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో అధికార కాంగ్రెస్ ను మొద్దు నిద్ర లేపింది బిఆర్ఎస్ పార్టీ . కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసే ఆ అక్రమ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బిఆర్ఎస్ పార్టీ ‘ అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ‘ గోదావరిలో 1000 టిఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంతుకు.. మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది బిఆర్ఎస్ పార్టీ.మల్లా అవే పాత అబద్దాలు ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి.. అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఇప్పటికీ ఎందుకు డిమాండ్ చేయవు?’ అని రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు.
‘ఏపీ సీఎం చంద్రబాబు పట్ల నువ్వు చూపుతున్న గురు భక్తికి ఇది నిదర్శనం కాదా?.GWDT అవార్డు ప్రకారం, CWC అనుమతి పొందకుండా ఈఏసీ అనుమతి ఇవ్వదు.ఏపీ అనుమతుల కోసం CWC కి వెళ్లే కంటే ముందే అపెక్స్ కౌన్సిల్ కు వెళ్లాలనే సోయి కూడా లేదు నీకు.కనీస అవగాహన లేని వ్యక్తులు నీటి పారుదల శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం.తొమ్మిదిన్నరేండ్ల బిఆర్ఎస్ పాలనలో ప్రస్తావనే రాని బనకచర్ల ప్రాజెక్టు, ఇప్పుడు ఎవరి అండ చూసుకొని ముందుకు వచ్చిందో తెలంగాణ ప్రజలకు తెలియదా?’ అని ప్రశ్నించారు.



