పంబన్ బ్రిడ్జిని ప్రారంభించిన మోడీ
భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ ఆధునిక సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇది. సముద్రంలో 2.08 కి.మీ. పొడవు ఉండే ఈ బ్రిడ్జి దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో దీన్ని నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది.
ఈ క్రమంలోనే రామేశ్వరం – తాంబరం ప్రత్యేక రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇది కొత్త బ్రిడ్జి మీదుగా పరుగులు తీసింది. రైల్లో విద్యార్థులు, ఇతర ప్రయాణికులు సందడి చేశారు. అదేవిధంగా బ్రిడ్జి కిందుగా ప్రయాణించిన కోస్ట్ గార్డ్ నౌకకూ పచ్చజెండా ఊపారు. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, తమిళనాడు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోడీ రూ.8,300 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు అభివృద్ధి పనులను ప్రారంభించారు.



