రేవంత్ రెడ్డి వికృత రూపం బయటపడింది : ప్రశాంత్ రెడ్డి
అసెంబ్లీలో ప్రభుత్వం బీఆర్ఎస్ గొంతు నొక్కిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, బీఆర్ఎస్ను తిట్టడానికే అసెంబ్లీని వినియోగించుకున్నారని ఆరోపించారు. ఏడు నెలల్లోనే రేవంత్ రెడ్డి వికృతరూపం బయటపడిందన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు.. నియంతృత్వ పాలన అని విమర్శించారు. రేవంత్ సభా నాయకుడిగా కాకుండా అడవికి రాజులా వ్యవహరించారన్నారు. ఇంత అధ్వాన్నంగా సభ ఎప్పుడూ జరగలేదని అక్బరుద్దీన్ అన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
కౌరవ సభలా నడిపారు
అసెంబ్లీని కౌరవ సభలా నడిపించారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ‘సీఎం ఇష్టారాజ్యంగా సభను తప్పు దోవ పట్టించారు. ఏ చర్చపై కూడా పూర్తిగా మాట్లాడనివ్వలేదు. కేసీఆర్ను తిట్టడం.. గత ప్రభుత్వంపై ఆరోపణలతోనే సభ నడించింది. జీరో అవర్ మొత్తం ఎత్తివేశారు. ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారు. ప్రజాసమస్యలపై మాట్లాడదామంటే మైకులు కట్టేశారు. ఇదేంటని అడిగితే మార్షల్స్తో బయటకు పంపించారు. హామీలను అమలు చేయడమే లక్ష్యంగా మేము మాట్లాడాం’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
అన్నీ అబద్దాలే మాట్లాడుతున్నారు
రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారంటీలు, 420 హామీల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ప్రశాంత్ రెడి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా వంద రోజుల్లో అమలుచేస్తామన్న హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎం అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. ‘మా ప్రభుత్వం వచ్చాక 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ చెబుతున్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎక్కడైనా ఉద్యోగాలు భర్తీ చేస్తారా?. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులను ఎంపిక చేస్తే.. ఈ ప్రభుత్వం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చింది’ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు.



