ICSI హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి భూమి పూజ
ICSI హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి భూమి పూజ

పల్లవి, హైదరాబాద్: ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది హైదరాబాద్ చాప్టర్ కి మాత్రమే కాకుండా దేశంలోని కార్పొరేట్ గవర్నెన్స్ కు కీలక ఘట్టం అని చెప్పొచ్చు. కంపెనీ సెక్రటరీలు దేశ కార్పొరేట్ రంగానికి రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కార్పొరేట్ కంపెనీలు విలువలను పాటిస్తూ పారదర్శకంగా చట్టాలను అనుసరించేలా చేస్తూ దేశ కార్పొరేట్ గవర్నెన్స్ కు మీరు వెన్నెముక లా నిలిచారు. కంపెనీల సమగ్రత కాపాడడంతోపాటు కార్పొరేట్ వ్యవహారాల నిర్వహణ సరిగా ఉండేలా చూస్తూ దేశ ఆర్థిక వృద్ధి లో కూడా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2017లో జరిగిన ఐసీఎస్ఐ జూబ్లీ వేడుకల్లో గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. దేశంలో కార్పొరేట్ సంస్కృతిని పెంపొందించడంతోపాటు దేశీయ వ్యాపారంపై నమ్మకం కలిగేలా చేశారని ఆయన ప్రశంసించారు. ఈ నమ్మకంతోనే దేశ విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా వడివడిగా ముందుకు సాగుతోంది. సత్యం వధ ధర్మం చర.. అనే సూత్రం ఆధారంగా ఐసీఎస్ఐ పనిచేస్తోంది. ప్రతి కంపెనీ సెక్రటరీ ప్రతిరోజు ఈ సూత్రాన్ని ఆధారంగా పని చేస్తే దేశ వ్యాపార రంగం నిజాయితీ పారదర్శకతతో ముందుకు సాగుతుంది. ఇప్పటికే భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మరో రెండేళ్లలోనే 5 బిలియన్ మార్క్ దాటనుంది. ఈ విజయం మీలాంటి ప్రొఫెషనల్స్ హార్డ్ వర్క్, అంకితభావం, విలువలతో కూడిన వ్యాపారం వల్లే సాధ్యమైంది. ఇప్పటికే జర్మనీ, జపాన్ లాంటి దేశాలు మన టాలెంట్ ని గుర్తించి, కంపెనీ సెక్రటరీలు, లాయర్లు, అకౌంటెంట్లను వారి దేశాల్లో పనిచేసేందుకు నియమించుకుంటున్నాయి. ఇంటెలెక్చువల్స్ కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. ఇంటలెక్చువల్, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవడం అంటే కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాదు. సమాజంతోపాటు ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుందని విషయం గుర్తుంచుకోవాలి. భారత్ ఆత్మ నిర్భరత సాధించే దిశగా కంపెనీ ఐసీఎస్ఐ లాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నాను. 2047 నాటికి భారత్ వికసిత భారత్ గా ఎదిగేందుకు భారత్ తో పాటు ప్రపంచ దేశాల్లో వ్యాపార రంగం అభివృద్ధి చెందేందుకు మీలాంటి ప్రొఫెషనల్స్, మీ నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది”అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.