శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం

పల్లవి, వెబ్ డెస్క్ : హైదరాబాద్ రామంతాపూర్లోని గోకులేనగర్లో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణాష్టమి నేపథ్యంలో ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపివేసిన యువకులు, రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లు దూరంగా పడిపోయారు.ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకొని, ప్రాథమిక చికిత్స చేపట్టి ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో కృష్ణయాదవ్, సురేశ్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నట్లు సమాచారం.