కాళోజీ కధల పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణా రావు

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ సాహిత్య ఆకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన పద్మభూషణ్ కాళోజి నారాయణరావు రచించిన కథల పుస్తకాన్ని సోమవారం డా.బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో సాంస్కృతిక, పర్యాటక, ఎక్సైజ్ పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో కాళోజి సాహిత్యానికి చేసిన కృషిని ఆయన కొనియాడారు. నా గొడవ అనే పుస్తకంలో ఆయన రాసిన కవిత్వమే కాకుండా సాహిత్యం లోని అనేక అంశాలను ఆయన స్పృశించారని, తెలంగాణ భాషకు ఆయన చేసిన కృషి కూడా గొప్పదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకోవడం ఎంతో శుభ సూచకమని, ఇంతటి గొప్ప సాహిత్యవేత 111వ జన్మదిన సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కాళోజీ కథల పుస్తకాన్ని తీసుకురావడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలా చారి, కవి యాకుబ్ , ఈమని శివనాగిరెడ్డి, ముచ్చర్ల దినకర్ తోపాటు పలువురు పాల్గొన్నారు.